-
బీబీనగర్ పీఏసీఎస్ నూతన అధ్యక్షుడు పొట్టోళ్ల శ్యామ్ గౌడ్
హైదరాబాద్, ది వాయిస్ : రైతుల అభ్యున్నతి, సహకార సంఘాల బలోపేతం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని బీబీనగర్ వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడు పొట్టొళ్ల శ్యామ్ గౌడ్ తెలిపారు. జిల్లా సహకార శాఖ అధికారి నాగార్జున సమక్షంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) నూతన పాలకవర్గం సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో సంఘం చైర్మన్ గా పొటోళ్ల శ్యామ్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా వాకిటి చంద్రశేఖర రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సమావేశంలో శ్యామ్ గౌడ్ మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా తమ పాలకవర్గం ద్వారా పారదర్శక పాలన అందిస్తామని తెలిపారు.
రైతు పక్షపాతిగా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కృషి చేస్తానని, సాగు పెట్టుబడి నుంచి పంట విక్రయం వరకు ప్రతి దశలో రైతులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం రైతులు, పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు, సహాయక చర్యలు అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో సంఘం డైరెక్టర్లుగా గండు బసవయ్య యాదవ్, సురకంటి ధనపాల్ రెడ్డి, అంబెపు బాలరాజు, ఉప్పలంచి శ్రీకాంత్, వనం శ్రీశైలం గౌడ్, వంగూరి శివకుమార్, బానోత్ వినోద్ నాయక్, శ్రీమతి కట్ట పెంటమ్మ, శ్రీమతి శెట్టి బాలమణి, రంగోల శ్రీనివాస్, మైలారం నరసింహ తదితరులు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ సిబ్బంది పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.









