హైదరాబాద్, ది వాయిస్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా కాంగ్రెస్ నాయకుడు పొట్టోళ్ల శ్యామ్ గౌడ్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సొసైటీ సీఈవో శివ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్యామ్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు మరో ఆరుగురు డైరెక్టర్లుగా పదవీ ప్రమాణం చేశారు. వాకిటి చంద్రశేఖర్ రెడ్డి, ఉప్పలంచి శ్రీకాంత్, గుండు బస్వయ్య యాదవ్, అంటెపు బాలరాజ్, బానోత్ వినోద్ నాయక్, వనం శ్రీశైలం గౌడ్ డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులతో పాటు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యామ్ గౌడ్ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన భువనగిరి శాసనసభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రైతులకు వీలైనంత మేరకు సహకరించగలనని తెలిపారు.









