హైదరాబాద్ (బోడుప్పల్), ది వాయిస్:
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీలో వేంచేసివున్న శ్రీ మాతా నిమిషాంబికా దేవి ఆదివారం భక్తులకు అద్వితీయమైన దర్శనం కల్పించారు. ఆషాడ ఆదివారం సందర్భంగా అమ్మవారు శాకంబరీ దేవిగా అత్యంత వైభవోవేతంగా అలంకరించుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

ఆషాఢ మాసంలో జగన్మాతను వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యాలు, పండ్లతో అలంకరించి శాకాంబరీ దేవిగా పూజించడం సనాతన సంప్రదాయంలో విశిష్టమైన ఆచారం. “శాకం” అంటే కూరగాయలు. సమస్త జీవరాశులకు ఆహారాన్ని ప్రసాదించే అన్నపూర్ణ స్వరూపిణిగా, ప్రకృతికి పోషకశక్తిగా అమ్మవారిని శాకాంబరీ దేవిగా కొలవడం ఆనవాయితీ.
ఈ పవిత్ర అలంకరణను దర్శించి పూజిస్తే ప్రకృతి వైపరీత్యాలు తొలగి, సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు పుష్కలంగా పండుతాయని, భూమాత సస్యశ్యామలంగా విరాజిల్లుతుందని, సమస్త జీవరాశులకు ఆహార లోటు ఉండదని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా ఆలయంలోని ప్రధాన దేవాలయంతో పాటు ఉపాలయాలలో మూర్తులను కూడా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో రూపొందించిన తోరణాలు, అలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి దివ్య శాకంబరీ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం నుంచే అశేష భక్తజనులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, ఒడిబియ్యం, సారె సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. భక్తులందరికీ అమ్మవారి దివ్య దర్శనం కల్పించేందుకు ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేసి, త్రాగునీరు, క్యూలైన్లు, ప్రసాద వితరణ, ఇతర సౌకర్యాలను సమకూర్చారు. శాకంబరి దేవిగా అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని కనులారా వీక్షించిన భక్తులు ఆ తల్లి అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు పుష్కలంగా పండి, ప్రపంచమంతా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసారా ప్రార్థించారు.
ఆలయ చైర్మ
న్ కామరౌతు వినోద్ కుమార్, సెట్లర్ కళావతి, ప్రధాన కార్యదర్శులు కె.అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, కోశాధికారి ఎన్.రమేష్ , రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు తదితరులు ఆలయంలో వుండి స్వయంగా భక్తులకు సదుపాయాలను కల్పించారు. ఆలయ ట్రస్ట్ ధర్మకర్తలు బి. హిమచందర్, వై. చంద్రశేఖర్, ఎస్. గౌరి శంకర్, డి. నర్సింగ్ రావు, ఎమ్. శ్రీనివాస్ రావు, ఎమ్. సాయి బాబా (శ్యామ్), డి. సతీష్, రామగిరి శ్రీకాంత్, ఎన్. శ్రీకాంత్, ఎన్ . రామకృష్ణ, ఎన్. మోహన్, డి. రామక్రిష్ణ, ఎన్. శ్రీధర్, వెంకట్ రాజారావు, కె. ప్రవీణ్ కుమార్, డి. నరేష్, వై. సత్యనారాయణలు భక్తులకు మంచిగా దర్శనం కల్పించడంలో సహకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ శర్మ, అర్చకుడు ఉమకాంత్ శర్మలు తమ సహ అర్చకులతో కలిసి అమ్మవారి దివ్య అలంకరణ చేయడంతో పాటు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు.










