ది వాయిస్, హైదరాబాద్: ఏళ్ల తరబడి నిరంతం అత్యంత శక్తిమంతమైన శ్రీరామ నామ సంకీర్తనం వినిపించే గుంటూరులోని అత్యంత ప్రాముఖ్యత గల శ్రీరామనామ క్షేత్రంలో శనివారం అత్యంత వైభవంగా సీతారాముల కల్యాణం జరిగింది. చిన్నతనం నుంచే శ్రీరాముడిపై అంచంచలమైన భక్తి పారవశ్యంతో మెలిగే రాగం ఆంజనేయులు ఈ ఆలయాన్నిప్రతిష్ఠించారు. ఆలయంలో 24 గంటల పాటు కూడా శ్రీరామ నామ సంకీర్తనం జరుగుతుంది. అందుకే ఈ క్షేత్రానికి శ్రీరామనామ క్షేత్రంగా పేరు వచ్చింది. ఈ ఆలయంలో శ్రీరాముడికి భక్తిప్రపత్తులతో తమ సమస్యలను నివేదించుకుంటే… వాటిని స్వామి తొలగించి ఆయా కుటుంబాలకు సాంత్వన కలిగిస్తారని, ఆలయంలో శ్రీరామచంద్రుల వారిని పిలిస్తే పలుకుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం,
శ్రీరామచంద్రుడు జన్మించిన పునర్వసు నక్షత్రం రోజున ప్రతినెలా ఇక్కడ అత్యంత వైభవంగా సీతారాముల కల్యాణాన్ని ఆలయ నిర్వాహకులు జరిపిస్తారు. అలాగే 2026 జనవరి 31న, శనివారం పునర్వసు నక్షత్రం సందర్భంగా ఇక్కడ అత్యంత వైభవోపేతంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. రాగం ఆంజనేయులు మనుమరాలు లీలా సుందరి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన సీతారాముల కల్యాణం శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు. కల్యాణ అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
